ముంబైలో వీధిలో నిల్చుని టీ తాగుతుంటే.. 42 వ అంతస్తు నుంచి జారిపడ్డ రాయి.. ఇద్దరి మృతి

  • వర్లీలోని గాంధీనగర్ లో ఘోర ప్రమాదం 
  • ఫోర్ సీజన్స్ హోటల్ పక్కన పార్క్ చేసిన పలు కార్ల ధ్వంసం
  • నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన 
ముంబైలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో నుంచి జారిపడ్డ భారీ రాయి ఇద్దరి ప్రాణం తీసింది. ఈ ఘటనలో కింద పార్క్ చేసిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలం మొత్తం బీభత్సంగా మారింది.

 పోలీసు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్లీలోని గాంధీనగర్ ఏరియాలో ఉన్న ఫోర్ సీజన్స్ హోటల్ పక్కనే భారీ భవంతి నిర్మాణంలో ఉంది. భవనంలోని 42 వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి పెద్ద బండరాయి కిందపడడంతో.. ఆ సమయంలో కింద టీ స్టాల్ లో టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ పార్క్ చేసిన పలు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకుని 108 అంబులెన్స్ తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపే తీవ్రగాయాలు కావడంతో వారిద్దరూ చనిపోయారు. మృతులను షబ్బీర్, ఇమ్రాన్ లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఆ బిల్డింగ్ కు ఎదురుగా ఉన్న హౌసింగ్ సొసైటీలో ఇద్దరూ పనిచేస్తున్నారని, రాత్రి డిన్నర్ చేశాక టీ తాగేందుకు అక్కడికి రాగా.. ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను దగ్గర్లోని నాయర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

mumbai
worli
four sesons
building construction
stone
fall

More Telugu News